కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించారు. తెలంగాణాలోని సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూలు, రామగుండం పట్టణాల్లో 8 నూతన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం తెలంగాణ చరిత్రలోనే కొత్త అధ్యాయమని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ఉండేవని… ప్రస్తుతం 1150 సీట్లు పెరిగాయన్నారు. మొత్తం 2,790 సీట్లు అందుబాటులోకి వచ్చాయని సీఎం పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. త్వరలోనే వైద్య సహాయక సిబ్బందిని నియమిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.