Andhra PradeshHome Page Slider

విజయనగర బ్లాక్‌లో ముఖ్యమంత్రి పేషీ?

Share with

ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చట్టాల్ని ధిక్కరించి.. దొడ్డిదారిన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది.

విశాఖపట్టణం: ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చట్టాల్ని ధిక్కరించి.. దొడ్డిదారిన రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం తహ తహలాడుతోంది. ఆ దిశగానే అధికార యంత్రాంగం వేగంగా పనులు చేస్తోంది. రుషికొండపై నాలుగు బ్లాకుల్లో మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే సీఎం నివాసంతో పాటు కార్యాలయం ఉంటాయని, సీఎం కుటుంబంతో ఉండేందుకు విజయనగర బ్లాక్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ బ్లాక్‌ను 5,828 చ.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించగా ఇప్పుడు 3,764 చ.మీ.లకు కుదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనం నుంచి సాగర అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్ గదులను సిద్ధం చేస్తున్నారు.

   ముఖ్యమంత్రి నేరుగా విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్ ఉపయోగిస్తారన్న ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో హెలి టూరిజం నిర్వహించిన సమయంలో హెలిప్యాడ్ నిర్మించారు. అక్కడి నుండి నేరుగా రుషికొండకు చేరుకునేలా ఇప్పటికే ఒక మార్గాన్ని కొండ వెనుక నుంచి ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు రుషికొండ చుట్టూ మూడు చెక్‌పోస్టులు, 24 గంటలు పోలీసు భద్రతతో దాన్ని పోలీసు వలయంలో పెట్టేశారు. కొండ వద్ద విశాఖ – భీమిలి బీచ్ రోడ్డు వైపు రెండు, కొండ వెనుక సముద్ర తీరంలో ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి అటుగా ఎవరూ రాకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. కొండకు సమీపంలోకి ఎవరెళ్లినా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తున్నారు. ఫొటోలు తీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఫోన్లు లాక్కుని వాటిని తొలగిస్తున్నారు. అటుగా నడిచి వెళుతున్న వారినీ కొన్నిసార్లు విచారిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది రిసార్టే అయితే.. సీఎం నివాసం, ఆఫీస్ ఇక్కడికి రాకపోతే పోలీసులు ఇంతలా ఆంక్షలు పెట్టాల్సిన అవసరమేంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎం రాకముందే ఆంక్షలు ఇలా ఉంటే. వస్తే పరిస్థితి ఏమిటో ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ మార్గంలో పోలీసుల ఆంక్షలు, రుషికొండ బీచ్ వైపు కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం పర్యాటకులను కలవరపాటుకు గురి చేస్తోంది.