NationalNews Alert

లోన్ యాప్‌లపై RBIకు కేంద్రం కీలక ఆదేశాలు

Share with

భారత్‌లో ప్రజల ప్రాణాలు తీస్తున్నదా’రుణ’ లోన్ యాప్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించటానికి సిద్ధమైంది. అడ్డగోలుగా పుట్టుకొస్తున్న డిజిటల్ రుణయాప్‌ల కట్టడికి వేగంగా అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా..కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జరిగింది. ఎంతోమందిని ఆత్మహత్య చేసుకునేలా వేధిస్తోన్న ఈ లోన్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా చట్టబద్దంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుణ యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేసింది.

వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గుర్తింపు ఉన్న యాప్‌ల జాబితా తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్బీఐ రూపొందించనున్న జాబితాలోని లోన్ యాప్ లు మాత్రమే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లాంటి యాప్స్ లో అందుబాటులో ఉండే విధంగా చర్యలుతీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు ఆమె సూచించారు. అదేవిధంగా లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలన్నారు. ఇకపై లోన్ యాప్‌లు అమాయక ప్రజల ఖాతాల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయా? అని ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. దీనికి అవకాశం ఉన్న అకౌంట్లపై కన్నేసి ఉండాలని ఆర్థిక మంత్రి సూచించారు. అటు నిర్దేశిత సమయంలో పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా ఆర్‌బీఐ జాగ్రత్త పడనుంది.

ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది బలైపోయారు. లోన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా లోన్ యాప్‌లు ఎంతో మంది ఉసురు తీశాయి. వద్దన్నా లోను ఇవ్వటం.. ఆపై వేధింపులు సాధింపులు..కుటుంబ సభ్యుల ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించడం..దీంతో ఎంతోమంది మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నారు. ఈ దా”రుణ” యాప్ ల వేధింపులకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.