ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం: చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ధీమాను టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 2024లో సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందని అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు యోచనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్ లో షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు ఉంటాయని దీనిపై అంతటా చర్చ జరుగుతుందని ఆయన వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా నేతలతో ఈ నెల నాలుగో తేదీన జగ్గయ్యపేట, నందిగామలో నిర్వహించనున్న బాదుడే బాదుడు కార్యక్రమం పై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. నేతలు ఆ దిశగా ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ నేపథ్యంలో అధికార పార్టీ ముందస్తు ఎన్నికల యోచనలో ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నేతలంతా ప్రజల్లో ఉండి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు. తాను కూడా ప్రజల్లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని దీనికి అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నామని నేతలకు చంద్రబాబు వివరించారు.