‘కోనసీమ అల్లర్లలో అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి’ :పవన్ కళ్యాణ్
కోనసీమ అల్లర్లలో అమాయకులపై పెట్టిన కేసులు అన్నిటిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు . ప్రజా ప్రతినిధులు ఎవ్వరు ఏ ఒక్క కులానికి పరిమితం కాదన్నారు. అన్ని కులాల పట్ల సమాన బాధ్యత వహించాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా విరాజిల్లుతుందని చెప్పారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం అమలాపురంలో ఆయన కోనసీమ జిల్లా పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి భవిష్యత్తు పై దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమానికి పరిమితమవ్వాలని పవన్ సూచించారు. ఎవరు తప్పు చేసినా వెనకేసుకొరాకూడదన్నారు. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింప చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నేరస్తులు సొంత కులం వాళ్ళయినా సరే చర్యలు తీసుకోవడంలో వెనకాడకూడదన్నారు. అప్పుడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. అప్పుడే సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన న్యాయం దక్కుతుందని పేర్కొన్నారు.