భూకబ్జా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
మాజీ మంత్రి,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు. కాగా ఆయనపై ఇవాళ భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాలు భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భిక్షపతి అనే వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో బాధితులు మల్లారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. కాగా మల్లారెడ్డిపై కేవలం కేసు నమోదు చేస్తే కుదరదని ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మల్లారెడ్డిపై సెక్షన్ 420,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని బాధితులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ భూకబ్జాలో మల్లారెడ్డికి సహకరించిన మూడుచింతలపాడు మండల తహసీల్దార్పై కూడా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.