Andhra PradeshNews AlertTelangana

బావగారితో బాలయ్యబాబు ‘అన్‌స్టాపబుల్’ షో

Share with

బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఆహా’ టీవీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’  కార్యక్రమం ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనందరకూ తెలుసు. ఈ కార్యక్రమం సీజన్-2 త్వరలో ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ గెస్టుగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విచ్చేసారు. ఈ ప్రోగ్రామ్‌లో బావ,బావమరుదులిద్దరూ కలిసి సందడి చేశారు. బాలకృష్ణ, చంద్రబాబు వ్యక్తిగత, వృత్తి పరమైన ఎన్నో ప్రశ్నలు అడగగా, చంద్రబాబు చాలా లౌక్యంగా సమాధానాలిచ్చారు. మీ జీవితంలో చేసిన రొమాంటిక్ పని ఏదన్న ప్రశ్నకు మీరు సినిమాలలో చేశారు, నేను కాలేజీలో చేసానంటూ చమత్కరించారు చంద్రబాబు. బైక్ సైలెన్సర్ తీసేసేవాడినని, తోటి విద్యార్థులతో షికార్లు చేసేవాడినని అన్నారు. మీ బెస్టు ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్నకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు. ఆయనతో కలిసి బాగా తిరిగే వాడినని అన్నారు.

రాళ్ళూ రప్పలతో ఉండే సైబరాబాద్‌ను మహానగరంగా మార్చారని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో బాహుబలి రాలేదు కాబట్టి దానిని గ్రాఫిక్స్ అనలేమని అన్నారు. ఎన్టీరామారావుగారిని ముఖ్యమంత్రి పీఠం నుండి తొలగించిన సంఘటనను బాలకృష్ణ అడుగగా, ఆరోజు ఆయన కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డానని, మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అని బాలకృష్ణను ఉద్దేశించి సీరియస్‌గా అన్నారు. అనంతరం లోకేశ్ ఎంట్రీ ఇవ్వడంతో అన్‌స్టాపబుల్ సెట్‌లో సందడి మొదలయ్యింది. లోకేశ్ హోస్టుగా మారి చంద్రబాబు, బాలకృష్ణను ఆసక్తికర విషయాలు రాబట్టాడు. ఈ షోలో నాకు బావ, మీకు బాబుగారు అంటూ చంద్రబాబును పరిచయం చేయడం మాత్రం హైలెట్‌గా మారింది. ఈ కార్యక్రమం ‘ఆహా’ ఓటీటీలో అక్టోబరు 14న ప్రసారం కాబోతోంది.