వెకేషన్ బెంచ్కు బదిలీ అయిన చంద్రబాబు బెయిల్ పిటీషన్
చంద్రబాబు బెయిల్ పిటీషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుపై విచారణను వెకేషన్ బెంచ్కు బదిలీ చేయాలని న్యాయవాదులు కోరారు. దీనితో అంగీకరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్కు బదిలీ చేసింది. 73 ఏళ్ల వయస్సులో 40 రోజులుగా జైల్లో ఉన్న కారణంగా చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి ఏమాత్రం బాగోలేదని మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఇదే కేసులో ఇతర నిందితులు బెయిల్పై ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు. కేసులో ఎలాంటి పురోగతి లేదని, చంద్రబాబును నిరవధికంగా రిమాండ్లో ఉంచుతున్నారని ఆరోపించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని గురించి ఆలోచించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై హైకోర్టులో ఐఏ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై కూడా విచారణను వెకేషన్ బెంచ్ చేపడుతుందని న్యాయమూర్తి తెలిపారు. ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను కోరిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కూడా వెకేషన్ బెంచ్కు ఇవ్వాలని రాజమండ్రి జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.