మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఆటో డ్రైవర్ల ధర్నా
మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఆటో డ్రైవర్ల ధర్నా చేయనున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లయ్యింది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణమనే పథకానికి ప్రజలంతా ఆకర్షితులై కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నేటి నుండే ఆ పథకం అమలులోకి రానుండడంతో ఆటో డ్రైవర్ల నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది. తమ బ్రతుకు తెరువు ఏం కావాలంటూ రోడెక్కుతున్నారు. ఆటోలు ఎక్కువగా ఉపయోగించేది మహిళలే అని, వారికి ఉచిత బస్సు అవకాశం కల్పిస్తే, ఆటోనే నమ్ముకున్న తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆటో యూనియన్ల నాయకులు నేడు హైదరాబాద్లో సమావేశమై, ప్రభుత్వానికి ఈ పథకం విషయంలో మరోసారి పరిశీలించమని కోరనున్నారు. మహిళలు నేటి నుండి సిటీ బస్సుల్లో, పల్లెవెలుగు, ఆర్టీసీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.