తెలంగాణలో బీసీలకే ముఖ్యమంత్రి పదవి..మాటిచ్చిన అమిత్ షా
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో మాటిచ్చారు. జనగర్జన సభలో సభాముఖంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సూర్యాపేటలోని జనగర్జన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. అమిత్ షా మాటలను తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు. దేశంలో కుటుంబపార్టీల పాలన మితి మీరి పోతోందని, దేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ను ప్రధానిని చేయాలని చూస్తోందని, అలాగే తెలంగాణలో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ను సీఎం చేయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. బడుగు, వెనుక బడిన వర్గాలను పట్టించుకునే నేతలు లేరని, కానీ ప్రధాని మోదీ తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమని బీజేపీని ఆశీర్వదించి, గెలిపించాలని ప్రజలను కోరారు.