ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఆందోళనలు
ఖమ్మంలోని వెలుగుమట్ల అనే ప్రాంతంలో భూదాన్ భూముల్లో పేదలు ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎంతోకాలంగా గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు వారు. వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నించడంతో ఆందోళనలకు దిగారు. ఇక్కడ నవోదయా కాలనీ వాసులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇది భూదాన్ భూములని పేదలు వాదిస్తున్నారు. ఇది 100 గజాల చొప్పున భూదాన్ ట్రస్ట్ పేదలకు ఇచ్చిందని, కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ భూములు ఇచ్చేస్తున్నారని వారు అంటున్నారు. వారివద్ద సర్వే నెంబర్లు, పట్టా పుస్తకాలు ఉన్నాయంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా తమ వద్ద రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. తమకు భూదాన్ ట్రస్టు ఇచ్చిన భూములు చూపించమని, ఎక్కడుంటే అక్కడకు వెళతామని పేదలు అంటున్నారు. వారు నినాదాలు చేస్తూ కర్రలతో ఆందోళనలు చేయడంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.