మళ్లీ గనుక కేసీఆర్ అధికారంలోకి రాకపోతే మరో అమరావతే: హరీష్రావు
హైదరాబాద్: మళ్లీ కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళనలో పడ్డారు. హైదరాబాద్ అమరావతి మాదిరిగా అవుతుందని వారు అనుకుంటున్నారని మంత్రి హరీష్రావు తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మంత్రి సమక్షంలో పీసీసీ మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి (బిత్తిరి సత్తి) బీఆర్ఎస్లో చేరారు. హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లాగా మోసం, ద్రోహం బీఆర్ఎస్లో ఉండవని, తమది అందర్నీ కలుపుకు పోయే పార్టీ అని అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ లాంటి బలమైన నాయకత్వం ఉండాలో.. ఢిల్లీకి, గుజరాత్కు గులాములైన బలహీనమైన నాయకత్వం ఉండాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ది రైతుల ఎజెండా, కాంగ్రెస్, బీజేపీలది బూతుల ఎజెండా. మనకు బూతులు మాట్లాడేవాళ్లు కాదు.. భవిష్యత్ నిర్మించే వాళ్లు కావాలి. రాష్ట్రంలో ఒకవైపు ఐటీ పరిశ్రమలు, మరోవైపు వ్యవసాయం అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్.. ఇవన్నీ కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయి. హిందీ హీరో సన్నీడియోల్, తమిళ్ హీరో రజనీకాంత్లు హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్కు ఇక్కడి అభివృద్ధి అర్థమవుతున్నది గానీ.. ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు. ఉప్పల్, మేడ్చల్, మల్కాజిగిరి సహా హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని హరీష్రావు ఓటర్లను వేడుకుంటున్నారు.