మణిపూర్ ఘటనపై ఆమ్ఆద్మీ పార్టీ దేశవ్యాప్త నిరసనలు
ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సూచనల ప్రకారం మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మణిపూర్ ఘటపై తక్షణమే ప్రధాని స్పందించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. దీనికి ఇతర పార్టీల నేతలు కూడా కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రధాని మోదీ పెదవి విప్పాలంటూ విపక్ష పార్టీలు నినాదాలు చేశారు. హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై చర్చలు జరుపుదామని చెప్పినా ప్రతిపక్షాలు వినిపించుకోకపోవడంతో తిరిగి లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. మే 4న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంతో పాటు వారిని సామూహిక మానభంగం చేసిన ఘటన ఈ మధ్యనే వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష పార్టీలు.