శోభనం గదిలోనే చనిపోయిన వరుడు
అన్నమయ్య జిల్లాలో పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. మదనపల్లెలో నవ వరుడు శోభనం గదిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే.. అతడు గుండెపోటుతో మృతిచెందాడు… మదనపల్లె చంద్రా కాలనీకి చెందిన యువతితో.. పాకాల మండల పత్తిపాటివారిపల్లికి చెందిన తులసి ప్రసాద్కు పెద్దల సమక్షంలో ఈ నెల 12 పెళ్లి జరిగింది. వీరు తొలుత ప్రేమించుకోగా.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకుని పెళ్లి చేశారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/09/image-451-1024x576.png)
ఈ క్రమంలోనే పెళ్లి అనంతరం శోభనం తంతుకోసం తులసి ప్రసాద్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో తులసి ప్రసాద్ ఉన్నట్టుండి బెడ్పై అచేతనంగా పడిపోయి ఉండగా గమనించిన వధువు.. కుటుంబ సభ్యులకు విషయం చెప్పి.. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తులసి ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. నవ వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నవ వధువు శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.