సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి సమీక్ష
సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి
ఈ ఏడాది వెయ్యి మందికి సింగరేణిలో కారుణ్య నియామకాలు
కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్దం చేయండి
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి
ఈ నెల 26న కొత్త గూడెంలో సోలార్ ప్లాంట్ ను ప్రారంభించనున్న భట్టి విక్రమార్క
సింగరేణి సీ.ఎండీ ఎన్.బలరామ్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణి లో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగర్రేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, డైరెక్టర్ (పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇతర అధికారులతో డిప్యూటి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్భందీగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఏలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న రూ.కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి ఆరా తీశారు. ప్రమాదభరితమైన బొగ్గు రంగంలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత ను కల్పించిన వారమవుతామని తెలిపారు. ఇప్పటి వరకు కోల్ ఇండియాలోనూ ఇలాంటి ఒప్పందం లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీ.ఎండి బలరామ్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కోటి ప్రమాద బీమాపై కార్మికులకు అవగాహన కల్పించాలని డిప్యూటి సీఎం సూచించారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2024/02/image-219.png)