‘నాకు ఈ పద్మశ్రీ అవసరం లేదు’..నిరసన తెలిపిన రెజ్లర్
WFI ఎన్నికలలో సంజయ్ సింగ్ను ప్రకటించడంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు పలువురు రెజ్లర్లు. వారిలో బజరంగ్ పునియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019లో క్రీడలలో తనకు లభించిన పద్మశ్రీ గౌరవాన్ని కూడా వెనక్కు ఇచ్చేస్తున్నానని ప్రకటించారు. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జనవరి నుండి మహిళా రెజ్లర్లు ఆందోళనలు చేశారు. అతనిని పదవి నుండి తొలగించినా, ఇప్పుడు జరిగిన కొత్త నియామకం కూడా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే అవడం రెజ్లర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మహిళా రెజ్లర్లు భద్రత లేని ఆటలు ఆడలేమని సాక్షిమాలిక్ తన బూట్లు బల్లపై పెట్టి కన్నీళ్లతో రాజీనామా చేసింది. ప్రధాని మోదీకి బజరంగ్ పునియా లేఖ రాస్తూ తనకు ఆటలలో దక్కిన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేస్తున్నానని వెల్లడించాడు. సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఉంటే అధికారం మళ్లీ బ్రిజ్ భూషణ్ చేతుల్లోకే వెళుతుందని మండిపడుతున్నారు రెజ్లర్లు. ఇప్పటికే వినేష్ ఫొగట్ కూడా ఈ దేశంలో న్యాయం ఎప్పటికి దక్కుతుందో అని ఆవేదన వ్యక్తం చేసింది.