గాజాలో ఆస్పత్రిపై మిస్సైల్ దాడి…500 మంది మృతి
ఒకవైపు హమాస్ తీవ్రదాడుల దాడులు, మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా నగరం చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత దారుణంగా అల్ అహ్లి ఆస్పత్రిపై పడిన మిస్సైల్ దాడిలో పేలుడు సంభవించి 500 మందికి పైగా మృతి చెందారు. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని, హమాస్ ఆరోపిస్తుండగా, హమాస్ ఉగ్రవాదుల చర్యేనని నెతన్యాహు వాదిస్తున్నారు. ఏదైమైనా దశాబ్దాలుగా జరుగుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలలో ఇదే అతి పెద్ద దారుణ ఘటనగా మారింది. ఉత్తర గాజాలో ప్రజలను దక్షిణ గాజాకు వెళ్లాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించింది. బాంబు దాడులు చేస్తోంది. నేడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరగడం భయం కలిగిస్తోంది. ఆయన జోర్డాన్లో కూడా పర్యటిస్తారు. అనంతరం అరబ్ నేతలతో సమావేశమవుతారు. ఇప్పటికే రెండువేల మంది అమెరికా సైనికులను ఇజ్రాయెల్ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటూ అమెరికా ఆదేశించింది. మరోపక్క గాజాపై హింసాత్మక చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. దీనితో ఇది ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి.