‘కోటా’లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు..17 మంది మృతి
రాజస్థాన్లోని ప్రవేశపరీక్షల కోచింగ్కు ప్రసిద్ధికెక్కిన కోటా లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు,మూడు వారాలకు ఒక ఆత్మహత్య కేసు నమోదు అవడంతో అందరూ ఉలిక్కిపడుతున్నారు. తాజాగా మెడికల్ పరీక్ష నీట్కు కోచింగ్ తీసుకుంటున్న మరో ఉత్తర ప్రదేశ్కు చెందిన విద్యార్థి మన్ జ్యోత్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని రామ్పుర్కు చెందిన మన్జ్యోత్ ఛబ్రా నీట్ శిక్షణ కోసం ఈ ఏడాది జనవరిలో కోటాకు వచ్చాడు. గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్లో విగతజీవిగా కనిపించాడు. ఆస్పత్రికి తరలించేసరికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 17 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వివిధ రాష్ట్రాల నుండి ఏటా వేలమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. పరీక్షలు, పోటీ చదువుల ఒత్తిడి వల్లే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.