గుంటూరులో లాంఛనంగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం
రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా అన్నదాతలకు ఎలాంటి మంచి జరిగితే బాగుంటుందో, వారిని ఏ విధంగా ఆదుకోవాలో తనకు తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరంలోని చుట్టుగుంట దగ్గర ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత సీఎం జగన్ ఆర్బీకేల పరిధిలో రైతులకు అందజేయనున్న ట్రాక్టర్లను, హార్వెస్టర్లను పరిశీలించారు. అనంతరం హార్వెస్టర్, ట్రాక్టర్ను జగన్ కొంతదూరం నడిపి రైతుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతన్నలు బాగుండాలన్న ఉద్దేశంతో.. వారికి అవసరమైన వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, కంబైన్ట్ హార్వెస్టర్లను అందజేస్తున్నట్లు తెలిపారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/06/image-6-827x1024.png)
ఇప్పుడు అందజేస్తున్న ఈ పరికరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని రైతులు వారికి కావాల్సిన సమయంలో వినియోగించుకోవచ్చని సీఎం చెప్పారు.ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కష్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆర్బీకే పరిధిలోని రైతులు అందరూ ఒక గ్రూపుగా ఏర్పడి.. వాళ్లు ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కిందకు వచ్చి.. తక్కువ ధరకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను పొందవచ్చన్నారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇవాళ్టి కార్యక్రమంతో రాష్ట్రంలోని మొత్తం 10, 444 ఆర్బీకేల పరిధిలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వ్యవసాయ పరికరాలు సమకూరినట్లు తెలిపారు. గతంలో 6225 ఆర్బీకేలకు యంత్రాలను అందజేశామని.. ఇవాళ మిగిలిన 3919 ఆర్బీకేల పరిధిలో 100 క్లస్టర్స్ స్థాయిలో దాదాపు 2562 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల కింద ఈ యంత్ర సామగ్రిని అందుబాటులో ఉండనుందన్నారు.