సాహసోపోతమైన “సలేశ్వరం” యాత్రకు పోటెత్తిన భక్తులు
నల్లమల అడవుల్లో లోయల్లో ఉన్న సలేశ్వర యాత్రకు భక్తులు పోటెత్తారు. తెలంగాణా అమర్నాథ్గా పేరుపొందిన సలేశ్వర యాత్ర నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఉంది. ఇక్కడ అడవిలో నివశించే చెంచులే పూజారులు. సాహస యాత్రికులే భక్తులు. శివశివా అంటూ శివనామస్మరణతో తెలంగాణా, ఆంధ్ర నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈ యాత్ర ఆద్యంతం సాహసంతో కూడుకొని ఉంటుంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/04/image-65.png)
దట్టమైన నల్లమల అడవులలో సలేశ్వరం గుట్టవలకే వాహనాలు వెళతాయి. తర్వాత లోయలోని లింగమయ్యను దర్శించాలంటే ఆరు కిలోమీటర్ల అడవిలోని పర్వత ప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. చాలామంది కర్రలు పట్టుకుని నడుస్తుంటారు. జారి పడతామనే భయంతో జాగ్రత్తగా నడుస్తూంటారు. 250 అడుగులు నుండి 500 అడుగుల ఎత్తు ఉండే జారుడు బండ లాంటి రాళ్ల బాటలో నడవాల్సి ఉంటుంది. ఇది సంవత్సరంలో ఐదు రోజులు మాత్రమే దర్శనం ఉంటుంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/04/image-66.png)
చైత్ర పౌర్ణమికి రెండు రోజుల ముందు 2 రోజుల తర్వాత దర్శనం ఉంటుంది. గత రెండు రోజులుగా జరిగిన ఈ యాత్రలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. విపరీతమైన రద్దీ వల్ల ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొక వ్యక్తి మరణించారు. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా వస్తున్నాం లింగమయ్య అంటూ భక్తులు వస్తూనే ఉంటారు.