సామాన్యుడిపై పెను భారం..మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యుడి జీవనం భారమైంది. అయితే మరోసారి గ్యాస్ ధరలను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు తాజాగా ప్రకటించాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తయారయ్యింది. గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్పై రూ.50/-,వాణిజ్య సిలిండర్పై రూ.350.50/- పెంచేశారు. అయితే పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమలుకానున్నాయి. కాగా నిన్నటివరకు హైదరాబాద్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 1105/- రూపాయలు ఉండగా అది నేటి నుంచి 1155/- అయ్యింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 2119.50/- ఎగబాకగా గృహవినియోగ వంటగ్యాస్ ధర 1103/- కు చేరింది. ఈ ఏడాదిలో వాణిజ్య సిలిండర్ ధరలను పెంచడం ఇది రెండోసారి. కాగా ఈ ఏడాది జనవరిలో 25/- రూపాయలు పెంచారు.