అనంతపురం వర్షాలపై సీఎం సమీక్ష
అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భారీగా కురుస్తున్న వర్షం , వరద కారణంగా నిలువ నీడ కోల్పోయిన వారికి అండగా నిలవాలని ఉన్నత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.2 వేలు అందించాలని , ముంపు ప్రాంత ప్రజలకు వెంటనే సహాయం అందేలా వేగవంతమైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి అందేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. వానలు , వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఆస్తి , పంట నష్టంపై అంచనాలు వేసి తగిన పరిహారం అందిచే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుండగా… తాజాగా బుధవారం పడిన వర్షం కారణంగా వారి పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది.